అభిషేక్ సింగ్విపై అంబానీ గ్రూప్ పరువునష్టం దావా!

SMTV Desk 2017-12-17 17:05:19  defamation suit, reliance, anil ambani group, abhishek singhvi, congress

ముంబై, డిసెంబర్ 17: ప్రముఖ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్విపై 5వేల కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. పార్టీ అధికార ప్రతినిధి అయిన ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని విమర్శించే క్రమంలో రిలయన్స్ పై కూడా ఆరోపణలు చేశారు. దేశంలో ప్రముఖ ఏభై కార్పొరేట్ సంస్థలకు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల మేర కేంద్రం రుణాలు మాఫీ చేసిందని సింగ్వి ఆరోపించారు. దేశంలో ఏభై కార్పొరేట్ కంపెనీలు 8.3 లక్షల రూపాయల రుణాలు చెల్లించవలసి ఉందని, వాటిని వసూలు చేయకపోగా గుజరాత్ కు చెందిన రిలయన్స్ అంబానీ గ్రూప్, అదానీ, ఎస్సార్ గ్రూప్ లకు మూడు లక్షల కోట్ల రుణాలు ఇచ్చారని సింగ్వి అన్నారని రిలయన్స్ గ్రూప్ తెలిపింది. ఇది తమ పరువు నష్టం కలిగించే వ్యాఖ్య అని, దీనిపై ఐదువేల కోట్ల రూపాయలకు దావా వేశామని ఆ కంపెనీ ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.