ఉట్నూరు, డిసెంబర్ 17: ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో లంబాడీలు, ఆదివాసీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఉట్నూరు, ఆసిఫాబాద్లలో పర్యటించారు. ప్రశాంత వాతారణంలో ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఇటు పోలీసు వ్యవస్థను, అటు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. హింసా ప్రవృత్తిని పెంచడానికి ప్రయత్నించే వారిపట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించేది లేదు" అని వెల్లడించారు. కాగా అక్కడ విధించిన 144 సెక్షన్ ఇంకా కొనసాగుతుంది. పరిస్థితులకనుగుణంగా 144 సెక్షన్ ఎత్తివేసే యోచనలో పోలీసు యంత్రాంగం ఉందని సమాచారం.