తిరువనంతపురం, డిసెంబర్ 17: క్షిపణి ప్రయోగాలతో వణికించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కేరళలో వెలిశారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో భాజాపా ప్రతినిధి సంబిత్ పాత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంబిత్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా... " సీపీఎం పోస్టర్పైకి కిమ్ బొమ్మ వచ్చింది. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారు(సీపీఎం) ప్రత్యర్థుల కోసం కేరళను యుద్ధక్షేత్రంగా మారుస్తారు. రాకెట్, క్షిపణులను ఆర్ఎస్ఎస్, భాజపా కార్యాలయాలపైకి ప్రయోగించే ప్రణాళికలను తదుపరి అజెండాగా పెట్టుకోవట్లేదనే ఆశిస్తున్నాను" అంటూ ట్విట్ చేశారు. ఇప్పటికే కేరళలో 2001 నుంచి 120 మంది భాజపా కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఒక్క కన్నూరులోనే 84 మంది ప్రాణాలు కోల్పోయారని భాజపా పేర్కొంటోంది.