బాలానగర్, డిసెంబర్ 17 : హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హిందువుల మనోభావాలు దెబ్బతినేల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర చలన చిత్ర సెన్సార్ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నందనం దివాకర్ శనివారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రసంగంలో మాట్లాడుతూ.."ముస్లింల జనాభా పెరగడంపై ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ చాలా ఆందోళన చెందుతున్నాయి. హిందువులు నలుగురు చొప్పున పిల్లలను కనాలని కోరుతున్నాయి. కానీ వారు ఒకరినే కనలేకపోతున్నారు. హిందువులు పిల్లలను కనాలంటే ఔరంగాబాద్లో రూ.5వేలకు దొరికే తారాపాన్ తినండి. అప్పుడు పిల్లలు పుడతారు." అని వ్యాఖ్యానించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నందనం దివాకర్ అసదుద్దీన్ ఒవైసీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాలానగర్ సీఐ భిక్షపతికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.