మెయిన్పురి(యూపీ), డిసెంబర్ 17 : ముగ్గురు దుర్మార్గులు ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే...ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురికి చెందిన ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తామంటూ బాలికను బెదిరించారు. వారి దురాఘతాన్ని భరించలేని బాలిక ఇటీవల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే పోలీస్స్టేషన్ కు వెళ్లిన కుటుంబసభ్యులు ఈ మేరకు ఫిర్యాదు చేయగా, వారు నిర్లక్ష్యంతో వ్యవహరించారు. దీంతో రెండు రోజుల పాటు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరో వైపు ఆ బాలిక ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఆ కిరాతకులు ఏకంగా ఆమెను చంపడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 13న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించి పరారయ్యారు. స్థానికులు అప్రమత్తమై వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, 40 శాతం గాయలైనట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన, సకాలంలో స్పందించని కారణంగా ఎస్సైను అధికారులు సస్పెండ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశామని, త్వరలో వారిని పట్టుకుంటామని మెయిన్పురి పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.