అనంతపురం, డిసెంబర్ 17: సుమారు ఆరు నెలల పాటు 3 వేల కి.మీ. పాదయాత్ర చేస్తానని ప్రకటించిన వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చూస్తుండగానే 500కి.మీ మైలురాయిని చేరుకుంది. నేడు జగన్ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి చేరుకోవడంతో 500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆయన గొట్లూరులో మొక్కను నాటారు. 37వ రోజు పాదయాత్ర గొట్లూరు గ్రామ శివారులో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యింది. అక్కడి నుంచి తుమ్మల, తిప్పేపల్లి క్రాస్, రావులచెరువు ఎస్సీ కాలనీల మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగుతుంది. ఉదయం 11 గంటలకు రావులచెరువు గ్రామంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్న భోజన విరామ అనంతరం ఎర్రగుంటపల్లి తండా క్రాస్కు చేరుకుంటారు. అక్కడినుంచి రావులచెరువు తండా, వెంకటతిమ్మాపురంల మీదుగా దర్శినమలకు చేరుకొని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారు.