చిత్తూరు, డిసెంబర్ 16 : పెళ్లి అయిన తొలిరాత్రి తనకు లైంగిక పటుత్వం లేదనే విషయాన్ని బయటపెట్టిందనే కోపంతో, భార్య శైలజను చిత్తూరుకు చెందిన రాజేష్ పైశాచికంగా చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రాజేష్తోపాటు అతని తండ్రిపై కేసు నమోదు చేసి, వారిని రిమాండుకు తరలించారు. కాగా, విచారణ మేరకు రాజేష్కు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని గంగాధర నెల్లూరు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు న్యాయస్థానం అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 14న గంగాధర నెల్లూరు ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ముగ్గురు సిబ్బంది రాజేష్ను చిత్తూరు జిల్లా జైలు నుంచి హైదరాబాదుకు తీసుకెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో 15వ తేదిన, రాజేష్కు శారీరక ప్రమాణాల పరీక్షలు నిర్వహించిన అక్కడి ఫోరెన్సిక్ విభాగ వైద్య బృందం శనివారం లైంగిక పటుత్వ పరీక్షలు చేపట్టింది. వారిచ్చిన నివేదికను పోలీసులు ఎట్టకేలకు న్యాయస్థానానికి అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.