న్యూ ఢిల్లీ, జూన్ 17 : ఆస్ట్రేలియాను సందర్శించాలనుకునే భారతీయులు వీసాల కోసం జూలై 1 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆస్ట్రేలియన్ హైకమీషన్ ప్రకటించింది. అర్హులైన వారి నుంచి విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన పోర్టల్ ఖాతా ద్వారా దరఖాస్తులను సమర్పించే వెసులుబాటు కల్పించనున్నట్టు ఆస్ట్రేలియన్ హై కమిషనర్ క్రిస్ ఎల్ సాప్ట్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే భారతీయులకు ఈ సదుపాయం చాలా ఉపయోగపడేవిధంగా ఉంటుందన్నారు. దరఖాస్తుదారుడి అనుమతితో మూడో వ్యక్తి అంటే.. కుటుంబసభ్యుడు, ట్రావెల్ ఏజెంట్, వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తు చేయడం, పత్రాల సమర్పణ సంబంధిత ప్రక్రియ వేగవంతమవుతుందని ఎల్సాప్ట్ అన్నారు. ఆస్ట్రేలియాకు వచ్చే పర్యాటకులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారని, గత సంవత్సరంతో పోలిస్తే భారతీయ పర్యాటకులు 15.4శాతం పెరిగినట్లు క్రిస్ వివరించారు.