అమరావతి, డిసెంబర్ 15 : దశల వారీగా గోదావరి పెన్నా అనుసంధానం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలనవనరుల శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం, కాలువల నిర్మాణ వ్యయం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కాలువలు రిజార్వయువుల ద్వారా ఎంత మేర గోదావరి వరద నీటిని పెన్నా వరకు తరలించవచ్చో అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారు రూ.80వేల కోట్లు వ్యయం కానుందని, 320 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు 3,625 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని వాప్కాస్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మహత్తర పథకం పూర్తికావాలంటే 32వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, ఇందులో 7వేల ఎకరాల అటవీ భూమి ఉందని తెలిపారు.