అమరావతి, డిసెంబర్ 15 : త్వరలో రాష్ట్రానికి గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావడానికి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాలయంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, అధికారులు ఎక్స్ సీఈఓ అస్టో టెల్లర్ మధ్య ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్కు సంబంధించి ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫైబర్గ్రిడ్తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 2వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ను గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యంత వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. గూగుల్ ఎక్స్ రాకతో ఆంధ్రప్రదేశ్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని లోకేశ్ అన్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో త్వరలోనే ఇది ఏర్పాటు చేస్తామన్నారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు ఈ ఒప్పందం రావడం విశేషం.