గుంటూరు, డిసెంబర్ 15: జనసేనపార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం లీజుకు తీసుకున్న స్థలం వివాదంపై అధినేత పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన చేశారు. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం గుంటూరు జిల్లా చినకాకాని గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 182/1, 181లోని 10 ఎకరాల భూమిలో మూడెకరాలు రైతు యార్లగడ్డ సుబ్బారావు నుంచి పవన్ లీజుకు తీసుకున్నారు. ఆ స్థలం అసలైన వారసులం తామే అంటూ కొందరు ముస్లింలు గురువారం మీడియా ముందుకొచ్చారు. దీనిపై స్పందించిన పవన్ స్థలం వివాదాస్పదమైతే రద్దు చేసుకుంటామని, చట్టంపై అపార గౌరవం ఉన్న పార్టీ జనసేన అని, స్థలం లీజుపై అంజుమన్ ఇస్లామిక్ కమిటీ సభ్యుల ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఓ రాజకీయ నాయకుడి సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించడం అనుమానాలకు తావిస్తో౦దని పవన్ వ్యాఖ్యానించారు. ఆ స్థలం ముస్లింలదని నిర్ధారణ అయితే వెంటనే ఆ స్థలానికి దూరంగా ఉంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.