కోల్ కతా,జూన్ 16 : భారతదేశం నుంచి మారుముర గ్రామాల వరకు ఎక్కడ వెళ్లిన అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి అంటున్న కేంద్రప్రభుత్వం, తాజాగా బ్యాంకు అకౌంట్ తెరవడానికి కూడా ఆధార్ ను తప్పనిసరి చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ నిర్ణయంతో ప్రజల వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు. బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఆధార్ తప్పనిసరి చేస్తే ఇబ్బందిపడేది నిరుపేద, అట్టడుగు వర్గాలవారే అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. వందశాతం ప్రజలకు ఆధార్ అందుబాటులో లేనిదే, బ్యాంకు ఖాతాలకు ఆధార్ ను తప్పని సరి ఎలా చేస్తారని నిప్పులు చెరిగారు. బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా రూ.50వేలు, ఆ పైనున్న ఆర్థిక లావాదేవీలకు కూడా ఆధార్ తప్పనిసరని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. అంతేకాక ప్రస్తుతమున్న బ్యాంకు అకౌంట్ ఖాతాదారులందరూ 2017 డిసెంబర్ 31 వరకు ఆధార్ ను బ్యాంకుల్లో సమర్పించాలని, లేనిపక్షంలో ఆ అకౌంట్లు చెల్లవిగా మారతాయని కేంద్రప్రభుత్వం వెల్లడించారు. దీంతో నిరుపేద వర్గాలను ఇబ్బంది పెట్టొద్దని, వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ సీఎం ఆవేశాన్ని వ్యక్తపరిచారు.