అమరావతి, జూన్ 16 : ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు అసెంబ్లీ భవనంలోకి వర్షపు నీరు చేరింది. ప్రతిపక్షనేత జగన్ ఛాంబర్ లో నీళ్ళు ప్రవహించడంతో పలు విమర్శలు తలెత్తాయి. దీనితో ప్రభుత్వం సీఐడీ విచారణ జరిపించగా, అసెంబ్లీ మేడ పైభాగంలో ఒక చోట కుట్రతోనే పైపును కోసేశారని సీఐడీ డీజీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పైప్ కోసిన ప్రాంతంలో నీళ్లు పోస్తే నేరుగా ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ భవనాన్ని మొత్తం పరిశీలించాక ఎటువంటి నిర్మాణ లోపాలు లేవని వివరించారు.