న్యూఢిల్లీ, డిసెంబర్ 13 : నాడు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. నేడు ఎదురెదురుగా నిలబడి నవ్వుతూ కరచాలనం చేసుకున్నారు. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్గాంధీ, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, రాజ్నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్ హాజరై మృతులకు నివాళులర్పించారు. ఈ క్రమంలో మోదీ, మన్మోహన్ ఎదురు పడి కరచాలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో కనిపించిన ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.