చెన్నై, డిసెంబర్ 13 : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వ్యవహారం విషయంలో మరో సంచలన వార్త వెలువడింది. ఆమెను అపోలో ఆస్పత్రికి చేర్చడానికి ముందు ఆమె నివాసంలోనే చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమెకు భారీగా స్టెరాయిడ్లు ఇచ్చినట్లు ఆక్యుపంక్చర్ వైద్య నిపుణుడు శంకర్ వెల్లడించారు. ఈ కేసులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆరుమురుగన్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని విచారించగా.. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన వివరణ ఆసక్తి రేపుతోంది. ఈ విషయంపై శంకర్ మాట్లాడుతూ.. "గతేడాది జయ అస్వస్థతకు గురైన వెంటనే ఆమె నివాసంలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ సమయంలో ఆమెకు మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్లు గుర్తించాం" అంటూ చెప్పిన సాక్ష్యాన్ని జస్టిస్ ఆరుమురుగన్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా జయకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ అధికారులను సైతం జస్టిస్ మురుగన్ విచారించనున్నారు.