తిరుపతి, డిసెంబర్ 12 : చనిపోయిన అధికారి పోలీస్ హెడ్క్వార్టర్స్ కు రావాలంటూ వచ్చిన ఉత్తర్వులు స్థానికంగా కలకలం సృష్టించాయి. వివరాలలోకి వెళితే... తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తున్న డి. రామాంజనేయులు అనారోగ్యంతో మృతి చెందారు. ఆ స్థానంలో మరో అధికారి రామ్ కుమార్కు బదిలీ పోస్టింగ్ ఇస్తూ.. చనిపోయిన రామాంజనేయులుని పోలీసు హెడ్క్వార్టర్స్ వచ్చి రిపోర్టు చేయాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. చనిపోయిన అధికారి ఎలా వస్తారంటూ పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీని అంతటికి కారణం ఆ డీఎస్పీ రేంజ్ అధికారి మరణాన్ని డీజీపీ కార్యాలయం రికార్డ్ చేసుకోకపోవడమే. ఒక రకంగా ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందని స్థానికులు చెప్పుకుంటున్నారు.