ఇస్లామాబాద్, డిసెంబర్ 12: ప్రతిష్టాత్మక చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ను నిర్మించి భారత్ కు చెక్ పెట్టాలన్న చైనా వ్యూహాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ప్రధానంగా సీపీఈసీ ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని సాకుతో చైనా నిధులు నిలిపివేసిందని తిరిగి నిధులను పునరుద్దరిస్తేనే పనులు మొదలు పెడతామంటూ 22 మంది సభ్యులు కలిగిన పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ తెలిపింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ అభివృద్ధి మంత్రి ఆషాన్ ఇక్బాల్ కూడా స్పష్టం చేశారు. సీపీఈసీ ప్రాజెక్ట్ మొదలయిన తరువాత ఇరుదేశాల మధ్య పలు సందర్భాల్లో వివాదాలు చెలరేగిన నేపధ్యంలో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ గురించి పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మూడు హైవే ప్రాజెక్టులను రద్దు చేయలేదని... నిధుల కొరత వల్ల నిలిపినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా... చైనా -పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఆర్థిక అవకతవకల వల్ల పూర్తిగా నిలిచిపోయిందనే వార్తలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం లేపాయి.