చెన్నై, డిసెంబర్ 12 : ఈరోడ్ జిల్లా చిన్నమలైలోని పిడారియూర్ గ్రామ౦లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. తమ ఇంట్లో ఉన్న ఫ్రిజ్లోని ఫ్రీజర్ బాక్స్లో ఐస్ గడ్డలు కట్టి శివలింగం రూపంలో దర్శనమిచ్చింది. ఇంకేముంది ఈ విషయం తెలిసిన ఊరు ఊరంతా ఆ ఇంటికి చేరి ఆ ఐస్ శివలింగానికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కుమార్ అనే వ్యక్తి గ్రీన్ హౌస్ పథకంలో భాగంగా కొత్త గృహాన్ని నిర్మించుకున్నారు. ఈ క్రమంలో పాత ఇంటి నుంచి సామాన్లు కొత్త ఇంటికి తీసుకొస్తుండగా, ఫ్రిజ్లో శివలింగం రూపంలో ఐస్ గడ్డ కట్టినట్లు కనిపించింది. దీంతో ఉలిక్కిపడ్డ ఆయన ఆ ఫ్రిజ్ను అక్కడే వదిలేసి వచ్చారు. ఆ మరుసటి రోజు ఐస్ శివలింగం అర అడుగు మేర పెరగడాన్ని గమనించి, లింగానికి కర్పూర హారతులతో పూజలు చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకుతూ గ్రామమంతా తెలిసిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన ఇంటికి వచ్చి పూజలు చేపట్టారు.