అమరావతి, డిసెంబర్ 12 : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సూచించారు. నేడు ఆయన కార్యాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రస్తావన వచ్చింది. ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖను సీఎం పేషీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం పై సీఎంలు మాట్లాడుకోవాలని ఆ లేఖలో వివరించారు. వెంటనే, దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త పరిణామమన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధానిదేనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే తాను ఒడిశా సీఎంతో మాట్లాడానని, రాజకీయ ఒత్తిడి వల్లే పోలవరం విషయంలో ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ సీఎంకు పరిస్థితి వివరించిన అనంతరం ఆయన మౌనంగానే ఉన్నట్లు చెప్పారు.