అమరావతి, డిసెంబర్ 11: ఏపి అసెంబ్లీ శాశ్వత భవనం తుది ఆకృతిని ఈ నెల 13న ఖరారు చేయనున్నారు. అమరావతి పరిపాలన నగరంలో నిర్మించే ఈ భవన ఆకృతులను లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ సిద్ధం చేసి౦ది. దీనిపై పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్, కమిషనర్ చెరుకూరి శ్రీధర్, సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో సమీక్షించారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు 12, 13 తేదీల్లో ముఖ్యమంత్రితో సమావేశం నేపధ్యంలో వారు రూపొందించిన ఆకృతుల విశేషాలను రాజమౌళి ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఆకృతులు తెలుగుదనం ఉట్టిపడేలా, ఆంధ్రుల సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించగా, ఆ బాధ్యతను రాజమౌళి నిర్వర్తిస్తూ నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తూ తగిన సూచనలిస్తున్నారు.