ఉత్తరప్రదేశ్, డిసెంబర్ 10 : రైలులో ప్రయాణిస్తుండగా జన్మించిన ఓ పసికందుకి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేరును పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ తండ్రి. తన భార్యతో కలిసి బంగర్మౌ ప్రాంతానికి చెందిన శివపాల్ అనే వ్యక్తి ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. కాస్తంతా దూరం ప్రయాణించగానే తన భార్య మీరాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినందుకు శివపాల్ సంతోషం వ్యక్తం చేస్తూ తన మొదటి బిడ్డకు అఖిలేశ్ అని పేరు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అఖిలేష్ శివపాల్ ను అభినందిస్తూ తనతో ఫోన్ లో మాట్లాడారు.