ఉత్తరప్రదేశ్, డిసెంబర్ 10 : చదువుకో అన్నందుకు తన తల్లిని, చెల్లిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేసిన ఘటన యూపీని నోయిడాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చదువులో ఎప్పుడు వెనుక వరుసలో ఉండే ఆ బాలుడు ఇంట్లో ఫోనులో గేమ్ ఆడుతున్నాడని తన తల్లి చదువుకో అంటూ మందలించింది. తరచూ తన తల్లి అలా చెప్పడంతో కోపం పెంచుకున్న ఆ బాలుడు అర్ధరాత్రి అందరు నిద్రిస్తుండగా తన తల్లితో సహా చెల్లిని కూడా అతి కిరాతకంగా చంపేశాడు. క్రికెట్ బ్యాట్ తో బలంగా కొట్టి పిజ్జా కట్టర్తో గుచ్చి హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్, డబ్బులు తీసుకొని పారిపోయాడు. పక్కింటి వారు ఇంట్లో ఏదో గొడవ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడి ఫోన్ డేటా ఆధారంగా అతడు వారణాసిలో ఉన్నాడని గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా వారిని చంపింది తానేనని అంగీకరించాడు. కాగా "గ్యాంగ్స్టర్ ఇన్ హైస్కూల్" అనే వీడియోగేమ్కు ఆ బాలుడు అలవాటు పడ్డాడని పోలీసులు వివరించారు.