విశాఖపట్నం, డిసెంబర్ 09: పాఠశాలకు చెందిన 4 బస్సుల్లో సుమారు 200 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లగా మార్గం మధ్యలో ఓ బస్సు బ్రేకులు పనిచేయకపోతే... అదికూడా ఎత్తైన కొండనుండి కిందికి దిగుతున్న సమయంలో పనిచేయకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో... వర్ణనారహితం. కాని డ్రైవర్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థులు ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే... అనకాపల్లి సిటి స్కూల్ కు చెందిన విద్యార్థులు విహారయాత్రలో భాగంగా యారాడ కొండపైకి వచ్చారు. అక్కడ భోజనాలు ముగించుకొని, బీచ్ కు తమ 4బస్సుల్లో ప్రయాణమయ్యారు. కొండ దిగుతున్న సమయంలో చివరి బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో, డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సుల డ్రైవర్లకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమై.. వారు తమ బస్సుల వేగాన్ని తగ్గించి వెనుక బస్సును నెమ్మదిగా నిలిపివేశారు. ఈ సంఘటనలో మధ్య బస్సులోని విద్యార్థులకు గాయాలు కాగా, మరో 80 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా తృటిలో ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.