గాంధీ నగర్, డిసెంబర్ 09 : గుజరాత్ తొలిదశ శాసన సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్ట్ చేశారంటూ ఓ కాంగ్రెస్ నేత ఆరోపించారు. జెట్పూర్ ప్రాంతాల్లోని ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్ట్ చేసి రిగ్గింగ్ చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి అర్జున్ మోధ్వాడియా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో జెట్పూర్ లోని దాదాపు 70 ఈవీఎంలను ఎన్నికల సంఘం మార్చేసింది. ఇదిలా ఉండగా జామ్కండోర్న పోలింగ్ బూత్లో 15 నిమిషాల పాటు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాస్త ఆలస్యమైంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయాన్ని పొడిగించాల్సిందిగా పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.