న్యూఢిల్లీ, డిసెంబర్ 09 : వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారంటూ పురుషులను శిక్షించి, మహిళలను మాత్రం వదిలిపెడుతున్నారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. భారత సంతతి వ్యక్తి జోసఫ్ షినే (40) అనే వ్యక్తి ఐపీసీ సెక్షన్ 497ను సవాలు చేస్తూ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఒక వివాహిత వ్యక్తి, మరో వివాహిత మహిళతో.. తన భర్త అనుమతి లేకుండా సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం కిందికి వస్తుంది. ఇలాంటి వ్యవహారంలో కేవలం పురుషునికి మాత్రమే శిక్ష విధిస్తారు. కాని మహిళకు ఎలాంటి శిక్షా ఉండదు. ఇదెక్కడి న్యాయం, దీన్ని కొట్టివేయాలని జోసఫ్ కోర్టుకు విన్నవించారు. ఈ కేసుపై స్పందించిన కోర్టు.. ఈ విషయంపై నాలుగు వారాల్లో ఒక నిర్ణయానికి రావాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.