కడప, డిసెంబర్ 08 : నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు. జిల్లాలోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది వేడుకల్లో హాజరైన వెంకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఫైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రొద్దుటూరుకు చాలా సార్లు వచ్చానని, తన వ్యక్తిగత కార్యదర్శి సత్యకుమార్ది ఇదే ఊరని, ప్రొద్దుటూరు విద్య, వాణిజ్యం, బంగారు షాపులకు కేంద్రమని వెంకయ్య వివరించారు. కాగా, అనిబిసెంట్ పాఠశాలకు వేంపల్లి సుబ్బిరెడ్డి స్థలం ఇచ్చారని, ఇప్పటి నేతలు భూములు ఎలా తీసుకోవాలా అని చూస్తున్నారని సుబ్బిరెడ్డి ధర్మగుణాన్ని వెంకయ్య ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప, బయ్యారంలో స్టీల్ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి అంగీకరించారని ఆయన చెప్పారు. ఈ మేరకు తొందరలో సానుకూల నిర్ణయం వస్తుందన్నారు.