బీజింగ్, డిసెంబర్ 07 : కొద్ది నెలల క్రితం భారత్-చైనా మధ్య డోక్లాం వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దాదాపు రెండున్నర నెలల పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న ఈ వివాదం ఆగస్టులో సద్దుమణిగిందనుకున్నలోపే, మరోసారి వివాదంతో చైనా ముందుకు వచ్చింది. భారత్కు చెందిన ఒక డ్రోన్ తమ గగనతలంలోకి వచ్చిందని చైనా ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్ జాంగ్ షౌలీ మీడియాకు ఈ విషయంపై ఆరోపించారు. ‘చైనా ప్రాదేశిక సౌర్వభౌమత్వాన్ని ఉల్లంఘించేలా భారత్ చర్య ఉంది. దీనిపై మేం తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం." అని అన్నారు. అసలు డ్రోన్ ఎప్పుడు వచ్చిందనే విషయాలను వెల్లడించలేదు. చైనా సరిహద్దు దళాలు డ్రోన్ను గుర్తించినట్లు తెలిపారు. అయితే, ఈ మేరకు భారత అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.