న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి కాపాడిన శ్రీలంక జట్టు కెప్టెన్ చండిమాల్ ను వన్డే సిరీస్ నుంచి తప్పించారు. ప్రధానంగా వన్డే సిరీస్కు సంబంధించి లంక సెలక్టర్ల నమ్మకాన్ని కోల్పోయిన చండిమాల్కు మొండిచేయే ఎదురైంది. భారత్ లో జరిగే మూడు వన్డే సిరీస్ ల కోసం శ్రీలంక బోర్డు జట్టును ప్రకటించింది. తిసార పెరీరా నేతృత్వంలోని లంక వన్డే జట్టుకు ఆ దేశ క్రీడల మంత్రి ఆమోదం లభించడంతో నేడు (బుధవారం) భారత్ కు రానున్నది. కాగా, ఆల్ రౌండర్ ఆసేలే గుణరత్నే, ఓపెనింగ్ ఆటగాడు దనుష్క గుణతిలకా తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఈ నెల 10న ధర్మశాలలో, రెండో వన్డే 13న మొహాలీలో, మూడో వన్డే 17న విశాఖ పట్టణంలో జరగనున్నాయి. వన్డే సిరీస్ శ్రీలంక జట్టు: తిసార పెరీరా (కెప్టెన్), గుణతిలక, తిరిమన్నే, మాథ్యుస్, గుణరత్నే, డిక్వెలా, చతురంగ, ధనుంజయ డి సిల్వ, చమీర, పతిరన, కుశాల్ పెరీరా