అమరావతి, డిసెంబర్ 06 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. తాజాగా వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ ఉద్యోగాల (డీఎస్సీ) భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రకటించారు. ఈ నెల 15న ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ డిసెంబరు 26 నుంచి ఫిబ్రవరి 2వరకు కొనసాగనుందని ఆయన తెలిపారు. అలాగే, పరీక్ష హాల్ టికెట్ల డౌన్లోడ్ల తేదీని మార్చి 2 నుంచి 9 వరకు నిర్ణయించినట్లు తెలిపారు.ఈ పరీక్ష తేదీలు మార్చి 23, 24, 26 కాగా, మెరిట్ లిస్టు ప్రకటన, మే 5న ఉంటుందన్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, మే 14 నుంచి 19వరకు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.