అమరావతి, డిసెంబర్ 06 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధిహామీ పథకంలో భాగం నేడు సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్వచ్ఛ ఆంధ్రా కార్పోరేషన్ అధికారులతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు నెలల్లో 1839 గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షల కంటే తక్కువ ఖర్చుతో పనులు జరిగాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 13 పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం కింద ఒక్క పనికూడా ఎందుకు జరగలేదని లోకేశ్ అధికారులను ప్రశ్నించారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రతి గ్రామంలోనూ రూ.20లక్షలకు తగ్గకుండా పనులు జరగాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ పథకంలో భాగంగా రోజుకి సగటు వేతనం రూ.141 ఇస్తున్నామని, దీన్ని త్వరలోనే రూ.165 చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం 24కోట్ల పని దినాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశానికి అనుగుణంగా పని చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.