విశాఖపట్నం, డిసెంబర్ 06 : విశాఖలో గత తొమ్మిది రోజులుగా డీసీఐ ఉద్యోగులు దీక్షా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వారికి అండగా అక్కడికి జనసేన నేత పవన్ కల్యాణ్ వెళ్లారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ, ఉద్యోగి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకోగా, ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. కాగా, అక్కడికి వెళ్లిన పవన్ కల్యాణ్ వెంకటేశ్ కుటుంబాని పరామర్శించారు. అయితే, దీక్షలో ఉన్న ఉద్యోగులు తమకు మద్దతు ఇవ్వడానికి ఎవరు ముందడుగు వేయని సమయంలో పవన్ కల్యాణ్ రాకతోనైనా తమ కష్టాలు తీరుతాయని ఆశ పడుతున్నామని ఉద్యోగులు అన్నారు. పవన్ కల్యాణ్ సైతం, నిరసన వేదికపై కూర్చుని, ఉద్యోగుల సమస్యలను విన్నారు. అనంతరం ఉద్యోగులందరూ చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.