లండన్, డిసెంబర్ 06 : సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు ఫేస్బుక్, గూగుల్, ట్విటర్ చర్యలు చేపట్టాయి. తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్ కూడా చేరింది. ఇకపై యూట్యూబ్లో ఏది పడితే అది పోస్టు చేయడానికి వీలుండకుండా, తీవ్రవాద భావజాలాలున్న వీడియోలను యూట్యూబ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఇందుకోసం నూతనంగా 10వేల మందిని నియమించుకోనుంది. ‘కొన్ని వీడియోలు యూజర్లను తప్పుదోవ పట్టించేలా, ప్రజలకు హాని కలిగించేలా ఉంటున్నాయి. మరికొన్ని చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అలాంటి వాటిని పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు 2018లో 10వేల కొత్త నియామకాలు చేపడుతున్నట్లు, గూగుల్కు చెందిన యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సూసన్ వోజి ఓ సామాజిక మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.