ముంబాయి, జూన్ 15: నిర్మాతగా సినిమా జగ్గా జాసూస్ నే చివరిదని ఇక నిర్మాతగా సినిమాలు చెయ్యనని ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తెలిపారు. జగ్గాజాసూస్ ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ, తాను చాలా బద్దకస్తుడినని, తన తత్వానికి సినీ నిర్మాణం సరిపోదని అది జగ్గా జాసూస్ సినిమాతో తేలిపోయిందని చెప్పారు. నటుడిగా ఆనందంగా ఉన్నానని, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉందని అన్నారు. కాగా, రణ్ బీర్ కపూర్ తాత అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్ కపూర్ 1948లో ఆర్.కె.ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అప్పట్లో ఆ బ్యానర్ పై చాలా సినిమాలు వచ్చాయి. 1999 తరువాత ఆ బ్యానర్ పై సినిమాలు నిర్మిచడం మానేశారు. ఆ నిర్మాణ సంస్థ బాధ్యతలు తీసుకున్న రణ్ బీర్ కపూర్ జగ్గా జాసూస్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. తరువాత వరుసగా సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తానని అప్పట్లో ప్రకటించారు. తాజాగా, ఈ ఒక్కసినిమా నిర్మాణం చాలని, ఇకపై సినిమాలు తీయనని చెప్పడం గమనార్హం. ఈ సినిమా సమయంలో విభేదాలు రావడంతో కత్రినా కైఫ్ ఈసినిమా నిర్మాణంలో సహకరించలేదు. దీంతో ఈ సినిమా ఆలస్యంగా రూపుదిద్దుకుంది. నిర్మాతగా తప్పుకోవడానికి జగ్గాజాసూస్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలే కారణమై ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.