న్యూఢిల్లీ, డిసెంబర్ 4: నిరంతరం కాలుష్యాన్ని కలిగించే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం ప్రకటించనుంది. మోటార్ వెహికల్స్ చట్టం 1988 సెక్షన్ 110 ప్రకారం, భారత్ స్టేట్-4 ప్రమాణాలు కలిగిన కొత్త మోటార్ వాహనాలు తయారీని ఏప్రిల్ 1,2020 కన్నా ముందే నిలిపివేయాలని, మిగిలిన వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 30, 2020నాటికి పూర్తవ్వాలనే నిబంధనలను సవరించనుంది. కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ దీనిపై వచ్చే అభ్యంతరాలు, సూచనలను డిసెంబర్ 20లోగా స్వీకరించనుంది. సెంట్రల్ మోటార్ వెహికల్(చట్టం) నిబంధనలు 2017 ప్రకారం ఈ నోటిఫికేషన్ గెజిట్ పబ్లిష్ కానుంది. ఆ తరువాత మరుసటి రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. ఇకపై ఈ చట్టంతో కేంద్రం కాలుష్యాన్ని ఎంతవరకు నియంత్రించగలుగుతారో వేచి చూడాలి.