సికింద్రాబాద్, డిసెంబర్ 03 : కూతురిలా చూసుకోవాల్సిన మామ ఆమెపై మనసుపడ్డాడు. మత్తు మందు ఇచ్చి ఆమె నిద్రలోకి జారుకున్నాక ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనికి ఆయన భార్య సహకారం తోడైంది. కాని నిజం నిప్పులాంటిది కదా విషయం బయటపడి చివరికి కటకటాలపాలయ్యాడు. అసలు విషయం ఏంటంటే.. నగరంలోని చిలకలగూడకు చెందిన బి.మోహన్దాస్(60)కు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని కుమారుడి భార్యను లొంగతీసుకోడానికి తన మూడవ భార్య భారతి సహకారాన్ని కోరాడు. భారతి ప్రతిసారి మత్తు మందు కలిపిన జ్యూస్ను కోడలుకు ఇచ్చేది. ఆమె మైకంలోకి జారుకోగానే మామ మోహన్ దాస్ అత్యాచారం చేసేవాడు. అలా తనకు వీలైనప్పుడల్లా భార్య సహకారంతో పలుమార్లు అత్యాచారం చేయసాగాడు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం కోడలు గర్భం దాల్చి, బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఎలాగో ఆమెకు నిజం తెలిసింది. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించి అత్తామామలపై ఈ ఏడాది జులై 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ బాబుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, మోహన్దాస్ డీఎన్ఏకు మ్యాచ్ అయింది. దీంతో పోలీసులు మోహన్ దాస్ ను అతని భార్య భారతిలపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.