న్యూఢిల్లీ, డిసెంబర్ 03 : "ట్రిపుల్ తలాక్" పై కేంద్రం ప్రవేశపెట్టాలని భావిస్తున్న బిల్లును హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ముస్లిం మహిళల గురించి ఆలోచిస్తున్న మోదీ ప్రభుత్వం, హిందూ మహిళల హక్కులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిలాద్ -ఉన్-నబీ ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. " 20 లక్షల మంది హిందూ మహిళలను ఏవో కారణాలతో తమ భర్తలు వదిలిపెట్టారు. మొదట వారిని రక్షించండి. ఇప్పుడు ఈ కొత్త చట్టం తీసుకువచ్చి ముస్లిం మహిళలకు కొత్త కష్టాలను సృష్టించడం మానుకోవాలి" అని ప్రభుత్వాన్ని కోరారు. "షరియత్" ను రక్షించుకునేందుకు భారతీయ ముస్లింలందరూ ఏకం కావాలని ఒవైసీ పిలుపునిచ్చారు.