హైదరాబాద్, డిసెంబర్ 03 : దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రపంచంలోనే తొలిసారిగా దివ్యాంగులకై ప్రత్యేక ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మొత్తం పదెకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఐదేళ్లలో సుమారు రెండు వేల మంది దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. ఈ సందర్భంగా బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వింధ్యా ఇన్ఫో మీడియా సీఎండీ పవిత్రలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. దివ్యాంగులకు ఊతమిచ్చేందుకు వీలుగా వారికి ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి.. ఈ ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతలను మంత్రి కేటీఆర్కు అప్పగించారు. దీని ప్రకారం ప్రభుత్వం ఐటీ పార్కును అభివృద్ధి చేస్తుంది.