బెంగుళూరు, డిసెంబర్ 2: దేశీయ రెండో ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, కొత్త సీఈవో పేరును వెల్లడించింది. గత నాలుగు నెలలు నీరిక్షణ అనంతరం నూతన సీఈవో, ఎండీగా సలీల్ ఎస్.పరేఖ్ నియమితులుయ్యారు. జనవరి రెండో తేదీ నుంచి ఆయన ఇన్ఫోసిస్లో చేరనున్నారు. ఇదిలా వుండగా పరేఖ్ క్యాప్జెమినీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఇన్ఫోసిస్ నియామక ప్రకటన చేయడం విశేషం. బాంబే ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సలీల్ బ్యాచిలర్ టెక్నాలజీ డిగ్రీ చేశారు. అనంతరం కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఆయన మాస్టర్ ఇంజనీరింగ్ డిగ్రీలు పొందారు. 2000 సంవత్సరంలో కేప్జెమినిలో చేరిన సలీల్...పలు హోదాల్లో సేవలందించారు. మూడు దశాబ్ధాలుగా ఐటీ రంగంలో ఆయనకున్న అనుభవం తమ సంస్థ పురోగతికి ఉపయోగపడుతుందని భావించి, బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తితో విభేదాల కారణంగా విశాల్ సిక్కా ఆగస్టు మాసంలో సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.