హైదరాబాద్, జూన్ 14 : తెలుగు టీవీ షోలో యాంకర్లుగా చిరంజీవి, నాగార్జున లాంటి అగ్రహీరోలు కనిపించి వారి అభిమానులను కనువిందు చేస్తున్నారు. వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీవీ షోలో ఎంట్రీ కానున్న విషయం తెలిసిందే. ఆ బాటలోనే మరో టాలీవుడ్ యంగ్ హీరో రెడీ అవుతున్నారు. తాజాగా దగ్గుబాటి రానా కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. జెమిని టీవీలో త్వరలోనే తాను కనిపించనున్నానని, ఆ ఛానెల్లో రానున్న నెంబర్ వన్ యారీ విత్ రానా అనే ప్రోగ్రాంలో హోస్ట్గా వ్యవహరిస్తున్నానని రానా తెలిపారు. ఇందుకు సంబంధించిన తన ఫస్ట్లుక్ను కూడా విడుదల చేశారు. త్వరలోనే సదరు టీవీ ప్రోగ్రాం టీజర్ విడుదల కానుందని వెల్లడించారు. ఐఫా ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో రానా, నాని లు యాంకర్లు గా అందరిని ఆకట్టుకున్నారు. ఇది వరకే రానా కొన్ని ఫంక్షన్ లలో హోస్ట్ గా వ్యవహరించి పలువురి మన్ననలు పొందారు. రానా యాంకర్ గా చేసే టీవీ షో చూడడానికి అభిమానులు ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు.