ముంబాయి, డిసెంబర్ 2: ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ రాక అలస్యమైన౦దుకు 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారం తెల్లవారుజామున బయలుదేరాల్సి ఉంది. అయితే, సమయానికి పైలట్ లేకపోవడంతో విమానం ఆలస్యమైంది. దాదాపు ఏడు గంటల పాటు ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొదట గంట ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పి, ఆ తరువాత ఏడు గంటలు ఆలస్యం చేసినట్లు, కనీసం వేచి ఉండేందుకు వసతి, తినడానికి ఆహారం కూడా ఇవ్వకుండా ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రయాణికులు తెలిపారు.