కర్నూల్, డిసెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు తేదేపాలో చేరడానికి జగన్ కు నాయకత్వ లక్షణాలు లేకపోవడమే ప్రధాన కారణమని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కర్నూల్ జిల్లాలో సాగుతుండగా సోమిశెట్టి స్పందించారు. సీఎం కుర్చీ కోసం కలలు కంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ, పాదయాత్రను కొనసాగిస్తున్నాడంటూ ఆయన విమర్శించారు. కేంద్రానికి రహస్యంగా లేఖలు రాస్తూ రాష్ట్ర అభివృద్దికి ప్రధాన అడ్డంకిగా జగన్ మారారని ఆయన మండిపడ్డారు. హత్యల గురించి మాట్లాడుతున్న జగన్ వే హత్యారాజకీయాలని, అవినీతి సొమ్ముతో పేపర్, ఛానల్ పెట్టి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు రాజకీయ సమాధి తప్పదని సోమిశెట్టి జోస్యం చెప్పారు.