లఖ్నవూ, డిసెంబర్ 01 : ఉత్తరప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయం దిశగా పరుగులు పెడుతుంది. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం మూడు విడతల్లో భాగంగా, నవంబర్ 22, 26, 29న ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, 652 పురపాలక స్థానాల్లో 16 మేయర్, 198 నగరపాలిక పరిషత్లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి. 16 మేయర్ సీట్లలో 14 స్థానాల్లో భాజపా విజయం కేతనం ఎగరవేసింది. రెండు స్థానాల్లో మాత్రం మేరట్, అలీగఢ్లో బహుజన్ సమాజ్ పార్టీ విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో లెక్కింపు కొనసాగుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సవాలులోనే యోగి ఆదిత్యనాథ్ భారీ విజయం సాధించడం విశేషం. దీంతో భాజపా నేతలందరూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.