హైదరాబాద్, డిసెంబర్ 01: టీ-హబ్ తో వినూత్న ఆవిష్కరణలకు అవకాశం కల్పించిన టీ సర్కార్ మరో అరుదైన పథకాన్ని ప్రకటించింది. జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మహిళా పారిశ్రామికవేత్తల కోసం వి-హబ్ ను ప్రారంభిస్తామని తెలిపారు. అందుకోసం రూ.15 కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో మహిళకు రూ.కోటి వరకు సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ అవసరాలకు చేసే కొనుగోళ్లలో మహిళా పారిశ్రామికవేత్తలకు వాటా ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే వీ(వుమెన్ ఎంటర్ప్రెన్యూర్స్)-హబ్ పూర్తి స్థాయి మార్గదర్శకాలను విడుదల చేసి మహిళా పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ భరోసా ప్రభుత్వం తరపున కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ వి-హబ్కు కేంద్ర ప్రభుత్వం అటల్ ఆవిష్కరణ మండలి తరఫున సాయం అందిస్తామని తెలిపారు.