హైదరాబాద్, నవంబర్ 30 : ఏడాది క్రితం పోలీసుల చేతులో ఎన్ కౌంటర్ గ్యాంగ్స్టర్ నయీమ్ పేరుతో ఓ యువకుడు ఫోన్ లో బెదిరింపులకు పాల్పడుతుంటే రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా సీఎపల్లికి చెందిన నగేశ్ అనే యువకుడు హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. ఈనెల 24న చంపాపేట్లో ఉండే మహేశ్బాబు అనే వ్యాపారికి ఫోన్ చేసి నయీమ్ పేరుతో బెదిరించి, రూ.కోటిన్నర ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆందోళన చెందిన బాధితుడు వెంటనే సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నగేశ్ను అరెస్ట్ చేశారు. నిందితుడు చెడుఅలవాట్లకు బానిసై సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, అతనికి నయీంతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.