న్యూఢిల్లీ, నవంబర్ 30 : తొలిసారిగా ముద్రించిన రూపాయి నోటుకు నేటితో వందేళ్ళు పూర్తయినట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. 1917, నవంబర్ 30 న ఇంగ్లాండ్లో మొదటి రూపాయి నోటు అచ్చయింది. ఆ నోటుపై బ్రిటీష్ చక్రవర్తి కింగ్ జార్జ్-V బొమ్మ ఉండేది. 1926 లో రూపాయి నోటు ముద్రణను ఆపివేసి తిరిగి 1940 లో ప్రారంభించారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ. 1 నాణేల్లోని వెండిని ఆయుధాల తయారీకి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చలామణి కోసం నాణేల స్థానంలో రూ. 1 నోట్లను ముద్రించడం మొదలుపెట్టారు. 2015 లో కొత్త రూపాయి నోటు చలామణిలోకి వచ్చింది. ఇప్పటికీ పలు పండగల్లో, శుభకార్యాల సమయంలో ఈ నోట్లను బహుమతిగా ఇవ్వడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.