అమరావతి, నవంబర్ 30 : నిరుద్యోగ భృతిపై మంత్రివర్గ సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ విషయంపై అసెంబ్లీ కమిటీ హాలులో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన జీవోయం, నిరుద్యోగ భృతి విధి విధానాలపై చర్చించారు. లబ్దిదారుల ఎంపికకు ఇంటర్ విద్యార్హత, 18 నుండి 35 ఏళ్ళ మధ్య వయసున్న వారిని ఎంపిక చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. వారి స్థానికత గుర్తించేలా ఆధార్, రేషన్, ఓటర్ ఐడీ కార్డులను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. కాగా ఈ భేటీలో వ్యక్తమైన అభిప్రాయాలను రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదించి ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చేనాయుడు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.