న్యూఢిల్లీ, నవంబర్ 30 : అవినీతి నిర్మూలన, పారదర్శక వ్యవస్థకు జీఎస్టీతో ముందడుగు పడినట్లయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ మాట్లాడుతూ... ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా బదులిస్తూ,‘మా ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ సందర్బంగా జీఎస్టీ పై ప్రస్తావించిన మోదీ, అవినీతి, నల్లధన రహిత సమాజాన్ని తయారుచేయడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం నేను ఎంచుకున్న మార్గానికి రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తే.. అందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని మోదీ అన్నారు. పెద్దనోట్ల రద్దుతో సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఉన్న నల్లధనం, ఇప్పుడు అంతరించిపోయే స్థితికి చేరిందని మోదీ పేర్కొన్నారు. అలాగే ఆధార్ అంశం పై ప్రధాని ప్రస్తావిస్తూ.. బినామీ ఆస్తులను బయటకు తీసుకొచ్చేందుకు ఆధార్ ఓ ఆయుధంలా పనిచేస్తోందన్నారు.