బెంగళూరు, నవంబర్ 29: వెండితెర కంటే బుల్లితెర ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు బుల్లితెరకు బాగా ప్రభావితులైతున్నారు. తాజాగా ఓ కన్నడ టీవీ సీరియల్ చూసి ఏడేళ్ల పాప తనకు తాను నిప్పుపెట్టుకున్న దారుణ సంఘటన కర్ణాటకలోని దేవనగరే జిల్లాలో హరిహర పట్టణంలో జరిగింది. శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఆ పాప చనిపోయింది. నవంబర్ 11న జరిగిన ఈ సంఘటన పాప తల్లిదండ్రులు మంజునాథ్, చైత్రలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. వారి కుమార్తె ప్రార్థన, టీవీలో ప్రసారమయ్యే రెండు సీరియళ్లను చాలా ఇష్టంగా చూసేదని, వాటిలో ఒక సీరియల్లో పాపకి ఇష్టమైన పాత్ర మంటల్లో డ్యాన్స్ చేయడం చూసి ప్రార్థన ప్రభావితమైందని, ఆ కారణంగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాను కూడా ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని ప్రార్థన తల్లి చైత్ర తెలిపింది. తాము ఎన్నిసార్లు వారించినప్పటికీ చైత్ర సీరియళ్లు చూడటం మానలేదని, దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని సీరియల్ చూడనివ్వకండని ఆమె కోరింది. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారడంతో ప్రార్థన కుటుంబానికి కన్నడ టీవీ నటుల పరామర్శలు వెల్లువెత్తాయి.