అమరావతి, నవంబర్ 29 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళాశాలలలోని విద్యార్ధుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రస్తావిస్తూ... రాష్ట్రంలో ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా సంబంధిత కళాశాల యాజమాన్యమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే చూస్తూ వూరుకోబోమని ఆయన హెచ్చరించారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అంశంపై 344 నిబంధన కింద శాసనసభలో సభ్యులు అనిత, శేషారావు, గీత, ఆదిత్య, అప్పలనాయుడు, విష్ణుకుమార్రాజు ప్రస్తావించిన అంశంపై సీఎం మాట్లాడారు. రాష్ట్రంలోని కళాశాలలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి వారిని రోబోలుగా మార్చడం సరికాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పద్ధతి తక్షణం మార్చుకోకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని కళాశాల యాజమాన్యనికి ఆయన స్పష్టం చేశారు.