హైదరాబాద్, జూన్ 14 : విశ్వంభరుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ మహాప్రస్థానంలో జరుగుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చివరిసారిగా ఆయన పార్థివదేహానికి నివాళ్ళర్పించారు. తన అభిమాన కవి అయిన సినారె అంతిమయాత్రలో ఆయన పాల్గొని ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. సినారె కవితా శైలిని విశిష్టంగా అభిమానించే సీఎం కేసీఆర్ అంత్యక్రియల తంతు ముగిసే వరకు మహాప్రస్థానంలోనే ఉన్నారు. సినారె అంతిమ సంస్కారాలకు సీఎంతోపాటు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసానిశ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సాహితీ ప్రియులు సినారె అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించి గన్ సెల్యూట్ తో గౌరవ నివాళి ఘటించారు.